'కొబ్బరి మట్ట'తో మరింత దగ్గరవుతా: సంపు

6 Sep, 2015 10:14 IST|Sakshi
'కొబ్బరి మట్ట'తో మరింత దగ్గరవుతా: సంపు

హైదరాబాద్: దసరా పండక్కి రాబోతున్న 'కొబ్బరిమట్ట' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని హృదయ కాలేయం సినిమా హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని కొత్త ఎల్లయ్య మెమోరియల్ హైస్కూల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. 'కొబ్బరిమట్ట' చిత్రంలో త్రిపాత్రాభినం చేస్తున్నానని ఇందులో తాను పాపారాయుడు, పెద్ద రాయుడు, ఆండ్రాయుడు పాత్రలతో అలరించనున్నట్లు చెప్పారు.

ఏడుగురు హీరోయిన్లు ఇందులో ఉండటం ప్రత్యేకత అన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలతో పాటు కామెడీ కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పారు. హృదయ కాలేయం, సింగం 123 చిత్రాలతో చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నానని.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింత ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దసరా పండుగకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని అన్నారు.