భార్యాబాధితుల కథ

2 Apr, 2019 06:35 IST|Sakshi
రాయ్‌లక్ష్మి

భార్యాబాధితులైన నలుగురు స్నేహితులు బ్యాచిలర్‌ జీవితమే బావుంటుందనుకుంటారు. ఆ క్రమంలో ఆ నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు సంజన (రాయ్‌లక్ష్మి)ని ప్రేమిస్తారు. ఓ డాన్‌లా సంజన వారికి ఎలాంటి గుణపాఠం చెబుతుంది? అనే కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒంబదులే గురు’. రాయ్‌లక్ష్మి లీడ్‌రోల్‌లో పి.టి. సెల్వకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాణీ వెంకటరమణ సినిమాస్‌పై నిర్మాత రవీంద్ర కల్యాణ్‌ తెలుగులో ‘సంజనరెడ్డి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం చాంబర్‌ కార్యదర్శి సాయివెంకట్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. రవీంద్ర కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ అంశాలతో సాగే చిత్రమిది. 120 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇదే బేనర్‌లో నా స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నా’’ అన్నారు. ‘‘రవీంద్ర కల్యాణ్‌లో మంచి దర్శకుడున్నారు. చెన్నైలో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు’’ అన్నారు రామసత్యనారాయణ. సహ నిర్మాత బాదినేని వెంకయ్య, మాటల రచయిత శ్రీసాయి, కె.కస్తూరి, నూనె రంగనాయకులు, వాయాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు