తను ఇక లేడు.. నా గుండె పగిలింది : హీరో కూతురు

4 Jul, 2019 11:59 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో, ‘మున్నాభాయ్‌’ సంజయ్‌ దత్‌ కూతురు త్రిషాల దత్‌ ప్రియుడు మరణించాడు. సోషల్‌ మీడియా వేదికగా త్రిషాల ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘నా గుండె పగిలింది. నన్ను ఎంతగానో ప్రేమించినందుకు, నా గురించి శ్రద్ధ వహించినందుకు కృతఙ్ఞతలు. నా జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావు. నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచలోనే అదృష్టవంతురాలైన అమ్మాయినని భావిస్తున్నాను. నీ దాన్ని అయినందుకు ఎంతగానో మురిసిపోయాను. నువ్వు నాలో శాశ్వతంగా జీవించి ఉంటావు. ఐ లవ్‌ యూ. మళ్లీ నిన్ను కలుసుకునేంత వరకు.. నిన్ను ఎంతగా మిస్సవుతానో నాకు మాత్రమే తెలుసు. ఎల్లప్పుడూ నీ దానినే.. బెల్లా మియా. నిన్నటి కంటే ఎక్కువగా నేడు.. నేటి కంటే రేపటి రోజున మరింత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో త్రిషాల భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు.

కాగా ఈ పోస్టులో తన ప్రియుడి పుట్టిన రోజు, మరణించిన రోజును ప్రస్తావించిన త్రిషాల అతడి గురించి మరే ఇతర విషయాలు వెల్లడించలేదు. పోస్టును బట్టి అతడు మంగళవారం చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే త్రిషాల తన ఇటాలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌(మరణించిన వ్యక్తి)తో దిగిన ఫొటోలను తరచుగా పోస్ట్‌ చేసేవారు. ప్రస్తుత పోస్ట్‌ నేపథ్యంలో... ‘జీవితకాల విషాదంలో మునిగిపోయిన త్రిషాల.. ఇకపై నువ్వు మరింత ధైర్యంగా పోరాడాల్సి ఉంటుందని’ అభిమానులు ఆమెను ఓదారుస్తున్నారు. కాగా త్రిషాల దత్‌ సంజయ్‌ మొదటి భార్య రిచా శర్మ కూతురన్న విషయం తెలిసిందే. కూతురితో సంజయ్‌కు పెద్దగా అనుబంధం లేదు.

మరిన్ని వార్తలు