మనశ్శాంతిగా ఉండనివ్వరా?.. వర్మపై ఫైర్‌

22 Jul, 2018 13:01 IST|Sakshi

విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై సంజయ్‌ దత్‌ సోదరి నమ్రతా దత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌ దత్‌ జీవితంపై వర్మ మరో బయోపిక్‌ తెరకెక్కిస్తానని ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుధాల కేసు నేపథ్యంలో ఇది ఉండబోతుందని హింట్‌ కూడా ఇచ్చారు. ‘సంజయ్‌ వద్దకు ఏకే- 56 రైఫిల్‌ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి పూసగుచ్చినట్లు వివరించే యత్నం చేస్తానని, అందుకు సంజు బాబాతోపాటు కేసును దర్యాప్తు చేసిన అధికారులను సైతం కలిసి కథను రూపొందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నమ్రతా దత్‌ స్పందించారు.

‘అక్రమాయుధాల కేసు సంజు జీవితంలోని ఓ బాధాకరమైన ఘటన. దాన్ని వర్మ ఎందుకు తవ్వాలనుకుంటున్నారు? ఆర్జీవీ సినిమాల్లో చూపించేదంతా చీకటి కోణాలే. అలాంటప్పుడు బయోపిక్‌తో సంజును క్షోభపెట్టాలనుకుంటున్నారా? మమల్ని మళ్లీ బాధలోకి నెట్టాలని ఆయన చూస్తున్నారా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంజుకి అభ్యంతరం లేకపోతే మాత్రం తాము వర్మ ప్రయత్నానికి అడ్డుతగలబోమని ఆమె స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు