సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక దృశ్య కావ్యం పద్మావత్ వివాదాల నడుమ విడుదలైనా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. దీపికా పడుకోన్ టైటిల్ పాత్ర పోషించిన ఈ మూవీ త్వరలోనే 100 కోట్ల క్లబ్లో చేరనుంది. బుధవారం ప్రీమియర్ షోల ద్వారానే రూ 5 కోట్లు రాబట్టిన పద్మావత్ గురువారం రూ 19 కోట్లు, శుక్రవారం రూ 32 కోట్లు, శనివారం రూ 27 కోట్లు కొల్లగొట్టి మొత్తం రూ 83 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆదివారం వసూళ్లు కలుపుకుంటే మూవీ 100 కోట్ల క్లబ్లో చేరుతుందని స్పష్టం చేశారు.
చరిత్రను వక్రీకరించారంటూ పద్మావత్ మూవీని రాజపుత్రులు, హిందూ సంస్థలు నిరసిస్తూ తీవ్ర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలు సైతం చిత్ర విడుదలను నిషేధిస్తున్నట్టు ప్రకటించినా సుప్రీం గ్రీన్సిగ్నల్తో వివాదాల నడుమ విడుదలైన పద్మావత్ వసూళ్లలో దూసుకుపోతుండటం పట్ల చిత్ర యూనిట్ ఊపిరిపీల్చుకుంది.