హీరోగా మారిన స్టార్ కమెడియన్

2 Oct, 2016 22:53 IST|Sakshi
హీరోగా మారిన స్టార్ కమెడియన్

'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మోషన్ పోస్టర్ విడుదల
కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ హోమియోపతి ద్వారా వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ కె.రవికిరణ్.. సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రోషిణీ ప్రకాశ్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇటీవల పోలాండ్ లో పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మోషన్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను మేర్లపాక గాందీ విడుదల చేశారు.

'కమెడియన్ గా బిజీ అవడంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో మాస్టర్స్‌ హోమియోపతి నిర్వహిస్తున్న రవికిరణ్‌గారి వైద్యంతో ఐదు రోజుల్లోనే రికవరీ అయ్యాను. అలా ఆ పరిచయంతో నా సినిమాకు అండగా నిలబడతానని మాటిచ్చి ఈసినిమాతో నిర్మాతగా మారారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో ఈ సినిమాకు నేనే స్క్రిప్ట్‌ రాసుకున్నాను. ఈ సినిమాను, నన్ను ఎవరు హ్యాండిల్‌ చేస్తారోనని ఆలోచించి అందుకు తగ్గ వ్యక్తిగా అరుణ్‌ పవార్‌ ను ఎంచుకున్నాను.  అరుణ్‌ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు' అని సప్తగిరి చెప్పాడు.

గాంధీ మాట్లాడుతూ.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' నుంచి సప్తగిరితో నాకు పరిచయం ఉంది. ఈ సినిమాతో సప్తగిరి హీరో కావడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత డా.కె.రవికిరణ్‌ మాట్లాడుతూ.. స్వతహాగా డాక్టరును అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తితో.. సప్తిగిరితో పరచయం వల్ల నిర్మాతగా మారాను. పోలీస్‌ వ్యవస్థ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పారు. దర్శకుడు అరుణ్‌ పవార్‌ మాట్లాడుతూ.. మాస్‌ ఆడియెన్స్‌ పల్స్‌ తెలిసిన సప్తగిరిగారు.. నన్ను పిలిచి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.  సినిమా ఇంత బాగా రావడానికి సప్తగిరితో పాటు సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ గారే కారణం. క్వాలిటీ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదన్నారు. బుల్‌గానిన్ మ్యూజిక్ అందించాడు. అలీ, పోసాని కృష్ణమురళి, శివప్రసాద్‌, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ కీలకపాత్రలు పోషించారు.