ఈ సినిమాకి ముగ్గురు హీరోలు

7 Dec, 2017 00:54 IST|Sakshi

‘‘కమెడియన్‌ అయిన నేను ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో చేసిన సెంటిమెంట్, ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యి హిట్‌ చేశారు. అందుకే మళ్లీ మరో మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమా చేయాలనుకుని ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చేశా ’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరోగా కశిష్‌ వోహ్రా కథానాయికగా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా. రవికిరణ్‌ నిర్మించిన ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సప్తగిరి చెప్పిన విశేషాలు.

► భారతదేశంలో ప్రతి పౌరుడుకీ న్యాయం దక్కాలని మన రాజ్యాంగం చెబుతుంది. అలాంటి న్యాయం ప్రతి ఒక్కరికీ దక్కడం కోసం పోరాడే ఓ చిన్న లాయర్‌ కథే ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి.’.

► ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’ రీమేక్‌ ఆలోచన నాది, రవికిరణ్‌గారిదే. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాన్ని కానిస్టేబుల్స్‌కు అంకితం ఇచ్చాం. ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి.’ని నిజాయితీ గల లాయర్స్‌కు అంకితం ఇస్తున్నాం.

► ఈ సినిమా ఎమోషన్స్‌తో నడిచినా, నా కామెడీ అలరిస్తుంది. చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలుంటాయి. కమెడియన్‌గా 75 సినిమాలు చేసినా అన్నిటిలో  కనపడేది ఒకేలానే కదా? అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఏడేళ్లు కష్టపడ్డాను. అనుకోకుండా కమెడియన్‌గా మారా. అలాగే హీరోగా మారా. ఇప్పుడు ఆ ఆలోచనలను ప్రెజెంట్‌ చేస్తూ నిజాయితీతో సినిమాలు చేయాలనేదే నా ప్రయత్నం.   

► చరణ్‌ లక్కాకులగారు సీనియర్‌ మోస్ట్‌ కో–డైరెక్టర్‌. నేను అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి కావాలనే ఆయన్ని కలిశా. రవికుమార్‌గారు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు.

► జాలీ ఎల్‌.ఎల్‌.బి’ చిత్రంలో బొమన్‌ ఇరానీగారు చేసిన పాత్రని సాయికుమార్‌గారు చేశారు. సౌరవ్‌ శుక్లాగారు చేసిన క్యారెక్టర్‌ను శివప్రసాద్‌గారు చేశారు. ఈ సినిమాలో నేను, శివప్రసాద్‌గారు, సాయికుమార్‌గారు ముగ్గురు హీరోల్లా చేశాం.

మరిన్ని వార్తలు