హీరోగా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శరత్‌కుమార్‌

19 Apr, 2017 02:31 IST|Sakshi
హీరోగా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శరత్‌కుమార్‌

నటుడు శరత్‌కుమార్‌ కథానాయకుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధం  అయ్యారు. ఇటీవల తెలుగు, మలయాళ వంటి ఇతర భాషా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న శరత్‌కుమార్‌ తమిళంలో కథానాయకుడిగా చిత్రం చేసి చాలా కాలమైందనే చెప్పాలి. ఇంతకు ముందు ఆయన నటించిన చెన్నైయిల్‌ ఒరునాళ్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా చెన్నైయిల్‌ ఒరునాళ్‌–2 చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. కల్పతరు పిక్చర్స్‌ పతాకంపై రామ్‌మోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జేపీఆర్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ప్రముఖ నవలా రచయిత రాజేశ్‌కుమార్‌ రాసిన ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం చెన్నైయిల్‌ ఒరునాళ్‌. ఈ రచయిత రాసిన నవలతో తెరకెక్కిన కుట్రం–23 చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుందన్నది గమనార్హం. శరత్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ తాజా చిత్రంలో మునీశ్‌కాంత్, అంజనా ప్రేమ్, రాజసిమ్మన్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. నిశ్శబ్దం చిత్రం ఫేమ్‌ బేబీ సాతన్య ప్రధాన పాత్రలో నటించనుంది.

దీపక్‌ ఛాయాగ్రహణం, రాణా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం కోవైలో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం అన్నారు. ఇందులో శరత్‌కుమార్‌ అండర్‌ కవర్‌ ఏజెంట్‌గా నటిస్తున్నారని చెప్పారు. ఆయన చేసే ఇన్వెస్టిగేషన్‌ సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను కోవైలో 30 రోజుల పాటు ఏకాధాటిగా నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.