ముంబైలో శశికుమార్‌

9 Jun, 2019 15:29 IST|Sakshi

నటుడు శశికుమార్‌ ముంబైలో మకాం పెట్టారు. అంతే కాదు అక్కడి తమిళులు తనపై చూపిన అభిమానానికి తబ్బిబ్బైపోతున్నారు కూడా. గ్రామీణ చిత్రాలకు పేటెంట్‌ హీరోగా మారిన ఈయన ఇప్పుడు సిటీస్‌లోనూ అలరించడానికి సిద్ధమైపోయారు. అలా శశికుమార్‌ తాజాగా నటిస్తున్న చిత్రాన్ని కల్పతరు పిక్చర్స్‌ పతాకంపై పీకే.మోహన్‌ నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్‌తో పాటు వినోదభరిత సన్నివేశాలతో కూడిన కమర్శియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రను నటుడు శరత్‌కుమార్‌ పోషించడం విశేషం.

ఎన్‌వీ.నిర్మల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను ముంబైలో బాగా జన సంచారం ఉన్న రోడ్లపై చిత్రీకరించామని తెలిపారు. షూటింగ్‌ అని తెలియకుండా కెమెరాలను చాటుగా ఉంచి ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. దీంతో అక్కడేదో గొడవ జరుగుతుందని భావించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారాన్ని అందించారన్నారు. దీంతో అక్కడకు పోలీసులు రావడంతో తాము పరిస్థితిని వారికి వివరించినట్లు చెప్పారు.

ముంబైలో శశికుమార్ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుందని తెలుసుకున్న కొంత మంది తమిళులు శశికుమార్ ను చూసేందుకు షూటింగ్‌ లోకేషన్‌కు చేరుకున్నారు. ముంబైలో ఉన్న తమిళులు కూడా తన పట్ల చూపిస్తున్న అభిమానానికి ముగ్ధుడైన శశికుమార్‌ అందరితో ఫోటోలు దిగి వారిని సంతృప్తి పరిచారు.

తమ పొరుగు రాష్ట్రాల్లోనూ ఇంతటి అభిమానులను సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారి రుణం తీర్చుకోవడానికి మంచి మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించాలని కోరుకుంటున్నానని శశికుమార్‌ తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు హీరోయిన్‌ను ఫైనల్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఒక ప్రముఖ సంగీత దర్శకుడు దీనికి సంగీతాన్ని అందించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇకపోతే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ను చెన్నైలో పూర్తి చేసినట్లు, ప్రస్తుతం ముంబైలో 15 రోజుల పాటు రెండవ షెడ్యూల్‌ను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

మరిన్ని వార్తలు