కీర్తి ఖాతాలో మరో క్రేజీ మూవీ

19 Sep, 2018 10:47 IST|Sakshi

నటుడు శశికుమార్‌తో లక్కీ కథానాయకి కీర్తీసురేశ్‌ జత కట్టనుందన్నది తాజా సమాచారం. కీర్తీసురేశ్‌ కోలీవుడ్‌కు పరిచయమైన చిత్రం ఇది ఎన్న మాయం చిత్రం పర్వాలేదనిపించుకున్నా, మలి చిత్రం నుంచే ఈ బ్యూటీ విజయ పరంపర ప్రారంభమైంది. అది ఇటీవల నటించిన మహానటి వరకూ కొనసాగింది. అంతే కాదు మహానటి చిత్రానికి ముందు ఆ తరువాత అన్నంతగా కీర్తీసురేశ్‌ క్రేజ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో నటిస్తోంది. 

అందులో రెండు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో విక్రమ్‌కు జంటగా నటించిన సామి స్క్వేర్‌ చిత్రం ఈ వారమే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇక విశాల్‌తో రొమాన్స్‌ చేసిన సండైకోళి–2 వచ్చే నెల విడుదల కానుంది. ఆ తరువాత విజయ్‌ సరసన నటించిన సర్కార్‌ దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

ఈ మూడు చిత్రాలపైనా భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా కీర్తీసురేశ్‌ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆమె నటుడు శశికుమార్‌తో జతకట్టడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇంతకు ముందు శశికుమార్‌ కథానాయకుడిగా సుందరపాండియన్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎస్‌ఆర్‌.ప్రభాకరన్‌ తాజాగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

గతంలో ఉదయనిధిస్టాలిన్‌ హీరోగా ఇదు కధిరవేలన్‌ కాదల్, విక్రమ్‌ప్రభు హీరోగా క్షత్రియన్‌ చిత్రాలను చేశారు. అవిఆశించిన విజయాలను అందించకపోవడంతో ఈ దర్శకుడు మళ్లీ తన తొలి చిత్ర హీరో వద్దకే వచ్చారు. ఈ చిత్రానికి  కొంబు వచ్చ సింగం అనే టైటిల్‌ను నిర్ణయించారు. బిగ్‌బాస్‌ ఆరవ్, సూరి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించనున్న ఇందులో కథానాయకి పాత్రకు నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.

నటుడు శశికుమార్‌కు ఇటీవల సరైన హిట్‌ పడలేదు. కీర్తీసురేశ్‌ లక్కుతోనైనా ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని ఆశిద్దాం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న కొంబు వచ్చ సింగం చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, పొల్లాచ్చి ప్రాంతాల్లో చిత్రీకరించుకోనుందట.

మరిన్ని వార్తలు