అజిత్‌తో సత్యజ్యోతి ఫిలింస్ చిత్రం

30 Jan, 2016 03:13 IST|Sakshi
అజిత్‌తో సత్యజ్యోతి ఫిలింస్ చిత్రం

వేదాళం చిత్రం తరువాత అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న విషయం తెలిసిందే. దానికి అజిత్ హీరోగా వీరం, వేదాళం చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివనే దర్శకత్వం వహించనున్నారన్న విషయం ప్రచారంలో ఉంది. అయితే ఆ చిత్రాన్ని ఏ సంస్థ నిర్మించనుందన్న అంశమే సస్పెన్స్‌గా ఉంది. అయితే ఆ విషయం ఇప్పుడు బయటపడింది. ఈ భారీ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనుంది. ఈ సంస్థ ప్రస్తుతం ధనుష్ హీరోగా ప్రభుసాలోమన్ దర్శకత్వంలో ఒక చిత్రం, విక్రమ్ ప్రభు హీరోగా ప్రభాకరన్ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మిస్తోంది. తాజాగా అజిత్ కథానాయకుడిగా భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సహా విదేశీయానంలో ఉన్న అజిత్ మే నెలలో చెన్నైకి తిరిగి రానున్నారు. అయితే ఆయన తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. చిత్రాన్ని 2017 జనవరికి విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో వీరం చిత్రం ఫేమ్ తమన్న మరోసారి అజిత్‌తో జత కట్టే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల భోగట్టా. చిత్ర వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదన్నది గమనార్హం. అయితే ఆ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది.