సత్యమేవ జయతే 1948

28 May, 2019 00:14 IST|Sakshi
ఇంతియాజ్, రఘునందన్‌

ఎం.వై.ఎం.క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వర్‌ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే 1948’. ఈశ్వరబాబు. డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్‌ కెమెరా స్విచాన్‌ చేయగా శరద్‌ దద్భావాలా క్లాప్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎం.వై. మహర్షి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన టైమ్‌లోని ముఖ్య నేతలు గాంధీ, నెహ్రూ, గాడ్సే, మహ్మద్‌ అలీ జిన్నా తదితర పాత్రలతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించి, గాడ్సే పాత్ర చేస్తున్న ఆర్యవర్థన్‌ రాజు మాట్లాడుతూ–  ‘‘11,372 పేజీల రీసెర్చ్‌ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి కథ తయారు చేయడం జరిగింది. 96 క్యారెక్టర్లు, 114 సీన్స్‌, 500కి పైగా ప్రోపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్‌ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్‌లో. 9 షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు