హర్రర్‌ చిత్రంలో సత్యరాజ్‌

17 Jan, 2018 14:02 IST|Sakshi

కోలీవుడ్‌లో హర్రర్‌ కథా చిత్రాల ట్రెండ్‌ చాలా కాలంగానే కొనసాగుతోంది. ఇందుకు కారణం ప్రేక్షకుల ఆదరణే అని చెప్పవచ్చు. ఇకపోతే దక్షిణ భారతీయ సినిమాలో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రకు జీవం పోసే నటుడు సత్యరాజ్‌. ఈ మధ్య బాహుబలి చిత్రంతో తన పేరును దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసుకున్న ఈయన తాజాగా హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు.

దీన్ని కళ్లపడం చిత్ర ఫేమ్‌ వేల్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన  తెలుపుతూ  పాత్రలకు నప్పే నటులను ఎంపిక చేసుకోవడం చిత్రానికి చాలా ముఖ్యం అని తాను భావిస్తానన్నారు. ఆ విధంగా తాజా చిత్రానికి సత్యరాజ్‌ నటించడానికి ఒప్పుకోవడంతో సగం పని తగ్గిందని అన్నారు. ఇది ఒక ఎఫ్‌ఎం రేడియో స్టూడియో నేపథ్యంలో సాగే సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. 

ఒక రాత్రి ఎఫ్‌ఎం.రేడియో స్టూడియోలో జరిగిన సంఘటన ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. దీన్ని ఒక ఎఫ్‌ఎం స్టూడియోలోనే చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఒక నూతన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. హర్రర్‌ కథా చిత్రాల్లో ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందని దర్శకుడు వేల్‌ పేర్కొన్నారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ సినిమా ఉత్కంఠ భరిత సన్నివేశాలతో అన్ని వర్గాలను అలరించే చిత్రంగా ఉంటుందని అన్నారు.

మరిన్ని వార్తలు