ఆ ఇద్దరితో సాయేషా రొమాన్స్‌

7 Apr, 2017 04:48 IST|Sakshi
ఆ ఇద్దరితో సాయేషా రొమాన్స్‌

బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు విజయ్‌ దర్వకత్వం వహిస్తున్న వనమగన్‌ చిత్రంలో జయంరవితో రొమాన్స్‌ చేస్తున్నారు. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలు అయిన సాయేషా ఇప్పటికే తెలుగులో అఖిల్‌ చిత్రంలో నటించారన్నది గమనార్హం. తాజాగా విశాల్, కార్తీలతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

విశాల్,కార్తీ కలిసి ఒక చిత్రం చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మల్టీస్టారర్‌ చిత్రానికి మరోస్టార్‌ నటుడు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న విషయం ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి త్వరలో ముహూర్తం కుదరనుంది. జూన్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. దీనికి కరుప్పురాజా వెళ్‌లైరాజా అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఒక కథానాయకిగా నటి సాయేషా నటించనున్నారన్నది తాజా సమాచారం.

 గత ఏడాది దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో నెగ్గిన విశాల్‌ జట్టు సంఘ భవన నిర్మాణ నిధి కోసం ఒక చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో విశాల్, కార్తీ కలిసి నటించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో కూడా కార్యదర్శి విశాల్‌ తాను కార్తీ కలిసి రూ.10 కోట్ల నిధిని అందించనున్నట్లు ప్రకటించారు.  తాము కలిసి నటించనున్న చిత్రాన్ని నడిగర్‌ సంఘం తరఫున నిర్మిస్తారా? లేక వేరే నిర్మాత చేస్తారా?అన్నది తెలియాల్సిఉంది.అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సిఉంది.