కోలీవుడ్‌ టార్గెట్‌..

9 Jun, 2018 07:58 IST|Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో వర్ధమాన కథానాయికల కొరత కనిపిస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇక్కడ మూడు పదుల వయసు దాటిన నటీమణులు అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొత్త నటీమణులు సక్సెస్‌ కోసం పోరాడుతూనే ఉన్నారు. దీంతో వర్ధమాన హీరోయిన్ల కొరత కోలీవుడ్‌లో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సినీ వర్గాలు. అదే విధంగా బాలీవుడ్‌ హీరోయిన్ల దాడి కొరవడిందనే చెప్పాలి. హన్సిక, తాప్సీ వంటి హీరోయిన్లను కోలీవుడ్‌ దాదాపు పక్కన పెట్టేసిందనే చెప్పవచ్చు. నటి హన్సిక చేతిలో ఒకే ఒక్క తమిళ చిత్రం ఉంది. ఇక నటి తాప్సీకి ఆ ఒక్క అవకాశం కూడా లేదు. ఇలాంటి సమయంలో ముంబై బ్యూటీ సాయేషా సైగల్‌ యువస్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి ఇంత వరకూ దక్షిణాదిలో సరైన సక్సెస్‌ పడలేదు.

కోలీవుడ్, టాలీవుడ్‌లో ఒక్కో చిత్రంలోనే నటించింది. అయితే కోలీవుడ్‌లో జయంరవితో రొమాన్స్‌ చేసిన వనమగన్‌ చిత్రంలో సాయేషా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ఆమెలో మంచి డాన్సర్‌ ఉందనే పేరు తెచ్చుకుంది. అంతే వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం కార్తీకి జంటగా కడకుట్టి సింగం, విజయ్‌సేతుపతితో జుంగా, ఆర్యతో గజనీకాంత్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఆర్యకు జంటగా నటించిన గజనీకాంత్‌ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఆ తరువాత వరుసగా కడకుట్టి సింగం, జుంగా చిత్రాలు తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం మరి కొన్ని చిత్రాలు సాయేషా సైగల్‌ తలుపుతడుతున్నాయట. దీంతో బాలీవుడ్, టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తూ కోలీవుడ్‌నే టార్గెట్‌గా పెట్టుకుని ఇక్కడ మంచి మార్కెట్‌ను సంపాదించుకోవాలని సాయేషా భావిస్తోందట. అలా యువ హీరోయిన్లు లేరనే విషయాన్ని తాను సద్వినియోగం చేసుకోవాలనే ప్లాన్‌లో ఈ ముద్దుగుమ్మ ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది.

మరిన్ని వార్తలు