-

వసూళ్ల కన్నా భద్రతే నాకు ముఖ్యం: ప్రముఖ హీరో

25 Dec, 2019 20:21 IST|Sakshi

ముంబై: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నడుమ దబాంగ్‌ 3 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా వసూళ్ల కన్న అభిమానుల భద్రతే ముఖ్యమని తెలిపాడు. నిరసనల మద్య దబాంగ్‌ 3 సినిమా విడుదలైనా ఘనవిజయం సాధించిందని తెలిపాడు.దీని క్రెడిట్‌ అభిమానులకే దక్కుతుందని కొనియాడాడు. ఉత్తర భారతంలో నిరసనల కారణంగా దబాంగ్‌ 3 సినిమా అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదని తెలిపాడు. మిగతా రాష్ట్రాలలో సినిమా ఆశించిన మేర కలెక్షన్లు రాబట్టిందని పేర్కొన్నాడు. తాను సినిమా రివ్యూలను చదవనని, సోషల్‌ మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటానని తెలిపాడు.

సోషల్ మీడియా వేదికగా ప్రజలు సినిమాపై వీడియోలను పోస్ట్ చేస్తున్నప్పుడు తనకు అర్థమవుతుందని వివరించాడు. దబాంగ్‌ 3  సినిమా ద్వారా పలువురు కొత్త నటులు అరంగేట్రం చేశారని వారిలో వినోద్ ఖన్నా సోదరుడు ప్రమోద్ ఖన్నా, మంజ్రేకర్‌లు ఉన్నారు. ​కొత్త నటులను ప్రజలు ఆదరించడంపై సల్మాన్‌ హర్షం వ్యక్తం చేశాడు.  డిసెంబర్‌ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన దబాంగ్‌ 3 నాలుగు రోజుల్లో రూ.91.85 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ కనిపించగా ఆయన సరసన బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.
 చదవండి: సల్మాన్‌ సినిమాకు అన్నేసి టికెట్లా?

మరిన్ని వార్తలు