నేనెవరికీ భయపడను!

2 Sep, 2018 09:34 IST|Sakshi

నేనెవరికీ భయపడను అంటున్నాడు నటుడు శివకార్తికేయన్‌. వరుత్తపడాదవాలిభర్‌సంఘం నుంచి వేలైక్కారన్‌ వరకూ వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ఆయన. తాజాగా శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం సీమరాజా. రెమో, వేలైక్కారన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన 24 ఏఎం.స్టూడియోస్‌  అధినేత ఆర్‌డీ.రాజా నిర్మించిన చిత్రం సీమరాజా. నటి సమంత హీరోయిన్‌గా నటించిన ఇందులో నటి సిమ్రాన్‌ నెగిటివ్‌ పాత్రలో నటించడం విశేషం. పొన్‌రాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియోను ఇటీవలే మదురైలో ఆవిష్కరించారు. చిత్ర పాటలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నటి సమంత మాట్లాడుతూ తాను నటించిన ప్రతి చిత్ర విడుదల సమయంలో కొంచెం దడ పుడుతుందన్నారు. అయితే ఈ సీమరాజా చిత్ర విషయంలో ఎలాంటి భయం అనిపించడం లేదన్నారు.

ఎందుకంటే ఈ చిత్ర విజయాన్ని ముందే రాసి పెట్టినట్లు సమంత పేర్కొన్నారు. చిత్ర హీరో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ సీమరాజా చిత్ర ట్రైలర్‌లోని మూడు షాట్స్‌ చూసి సామాజిక మాధ్యమాల్లో బాహుబలి స్థాయిలో ఉందనే ప్రశంసలు రావడం చిత్ర యూనిట్‌ శ్రమ, ఖుషికి దక్కిన ఘనతగా భావిస్తున్నామన్నారు. చిత్రాన్ని వినాయక చతుర్ధశి సందర్భంగా విడుదల చేయాలని ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని, అయితే చిత్ర పరిశ్రమ బంధ్‌ వంటి సంఘటనలను ఆటంకంగా మారి, చిత్రాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయగలగడంతో చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. తాను ఇందులో తమిళ రాజాగా నటించడం గర్వంగా ఉందన్నారు. రజనీ మురుగన్‌ చిత్ర నిర్మాణ సమయంలోనే తాను దర్శకుడు పొన్‌రామ్‌ ఈ చిత్ర కథ గురించి చర్చించుకున్నామన్నారు. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు పిల్లలను అలరించే విధంగా ఎలాంటి హింసాత్మకం లేకుండా జాగ్రత్తపడినట్లు తెలిపారు. చిత్రంలో హాస్య సన్నివేశాలు చాలానే ఉన్నాయన్నారు. మరో విషయం ఏమిటంటే తానెవరినీ పోటీగా భావించడం లేదని, ఎవరిని చూసీ భయపడటం లేదని, అదే సమయంలో ఆసూయ పడడం లేదని అన్నారు. తన తదుపరి చిత్రం ఏమిటన్న విషయం దాని గురించే తన పయ నం సాగుతుందని శివకార్తికేయన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు