14 ఏళ్లు: అందరి గుండెల్లో ‘గోదావరి’

19 May, 2020 13:09 IST|Sakshi

సుమంత్‌, కమలినీ ముఖర్జీ జంటగా తెరపై కనిపించిన చిత్రం ‘గోదావరి’. విభిన్న శైలి కలిగిన శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఆర్ట్స్‌పై జివిజి రాజు నిర్మించారు. రాజమండ్రి నుంచి లాంచీలో భద్రాచలం వరకు జరిగిన ఈ రీల్‌ ప్రయాణంలో, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని అతి సుందరమైన అందాలను చూపిస్తూ, సున్నితమై మనసులు, కుటంబాల మధ్య ఉండే భావోద్వేగాలను సహజత్వానికి దగ్గరగా, కమర్షియల్‌ పంథాకు దూరంగా ఉండే ‘గోదావరి’ చిత్రం విడుదలై నేటికి పద్నాలుగేళ్లు పూర్తయింది. సున్నితమైన ఎమోషన్స్‌, సహజత్వానికి దగ్గరంగా ఉండే సంభాషణలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 

సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ అందించిన ప్రతి పాట సుమధురమైనదే. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఆయువుపట్టు అనే చెప్పాలి. ఈ చిత్రం పూర్తిగా శేఖర్‌ కమ్ముల స్టైల్లో మంచి సంగీతంతో కూడిన ఓ ఫీల్‌గుడ్‌మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విశేష ప్రేక్షకాదారణ లభిస్తూనే ఉంది. విడుదలై ఏళ్లు గడుస్తున్నా  ఈ చిత్రం టీవీల్లో వచ్చిందంటే రిమోట్‌ పక్కకు పడేసి ఛానల్‌ మార్చకుండా ఆసక్తిగా చూస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ పద్నాలుగేళ్ల కిత్రం వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ తన చల్లదనాన్ని అభిమానులకు పంచుతూ వారిని రిలాక్స్‌ మూడ్‌లోకి తీసుకెళుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం సినిమా ఘన విజయం సాంధించడంతో పాటు ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకుంది.  



చదవండి:  
హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు
హరీశ్‌ మరో చిత్రం.. పవన్‌ ఫ్యాన్స్‌కు డౌట్‌

మరిన్ని వార్తలు