'ఆ పని నాది కాదు'

19 Oct, 2013 20:24 IST|Sakshi
'ఆ పని నాది కాదు'

తన సరసన నటించే హీరోయిన్లను తాను ఎంపిక చేయనని, ఆ పని దర్శక నిర్మాతలే చూసుకుంటారని యువ నటుడు విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. వైవిధ్యభరిత పాత్రలతో దూసుకుపోతున్న ఈ హీరో తాజా చిత్రం ఇదర్కుదానే ఆశైపట్టాయ్ ఇటీవల విడుదలై హిట్ టాక్ పొందింది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి పత్రికల వారితో శుక్రవారం భేటీ అయ్యూరు.
 
నూతన అవకాశాలను నిరాకరిస్తున్నారట?
నిజమే. ప్రస్తుతం నా చేతిలో ఏడెనిమిది చిత్రాలున్నాయి. ఇవి పూర్తి కావడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టవచ్చు. మళ్లీ నూతన చిత్రాలను ఒప్పుకుని అప్పటి వరకు దర్శక నిర్మాతలను వేచి ఉండమనడం సరికాదు. అందువల్లనే కొత్త చిత్రాలను అంగీకరించడం లేదు. ఈ విషయాన్నే నిర్మాతలకు స్పష్టం చేస్తున్నాను.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాల వివరాలు చెప్పరా?
రమ్మీ, పణై్నయారుమ్ పద్మినియుమ్ చిత్రాల షూటింగ్ పూర్తియింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఇవి త్వరలో తెరపైకి రానున్నాయి. సుధాకర్ దర్శకత్వంలో సంగుదేవన్, శీను రామస్వామి దర్శకత్వంలో ఇదంపొరుల్ ఇవళ్, ఆనందకుమరేశన్ దర్శకత్వంలో సంతోష్‌కుమార్, ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో పురంబోక్కు, జయకృష్ణ దర్శకత్వంలో వన్మం, రంజిత్ దర్శకత్వం వహించే మెల్లిసై చిత్రాలు చేస్తున్నాను. అన్నీ మంచి పేరు తెస్తాయని భావిస్తున్నాను.

ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సన్నివేశాలు ఏమీలేవే?
అలాంటి సన్నివేశం పిజ్జా చిత్రంలో చోటు చేసుకుంది. అయితే అంతగా రొమాన్స్ సన్నివేశాలు లేకపోవడం అనేది నాకు లభించిన కథలే కారణం.

ఏ హీరోయిన్‌తోనైనా జత కట్టాలని కోరుకుంటున్నారా?
అలాంటి కోరికలేమీ లేవు.

హీరోయిన్ల ఎంపికలో మీ ప్రమేయం ఎంత వరకు ఉంటుంది?
ఇసుమంతా ఉండదు. నా చిత్రాల్లో హీరోయిన్ల ఎంపిక నిర్ణయం పూర్తిగా దర్శక నిర్మాతలదే.

నటుడిగా మీ ఎదుగుదలకు కారణం ఎవరంటారు?
కచ్చితంగా దర్శకులే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని నేను ఈ స్థాయికి రావడానికి దర్శకుల ప్రోత్సాహమే కారణం.

ఇద్దరు హీరోల చిత్రాలలో నటించడం గురించి ఏమంటారు?
నా పాత్ర బాగుంటే ఆ చిత్రంలో హీరోలు ఇద్దరా, ముగ్గురా అని పట్టించుకోను. ప్రస్తుతం ఆర్యతో కలిసి ఒక చిత్రం, విష్ణుతో మరో చిత్రం చేస్తున్నాను.