ప్రశాంత్‌ ఈజ్‌ బ్యాక్‌

18 Nov, 2018 10:37 IST|Sakshi

చార్మింగ్‌ హీరో ప్రశాంత్‌ చిన్న గ్యాప్‌ తరువాత ఫుల్‌ యాక్షన్‌ ప్యాకేజ్‌తో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. సాహసం చిత్రం తరువాత ఈయన నటిస్తున్న తాజా చిత్రం జానీ. ఈ పేరు వింటే నటుడు రజనీకాంత్‌ గుర్తుకొస్తారు. అవును ఆయన చిత్ర టైటిల్‌తో ప్రశాంత్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్‌ మూవీస్‌ పతాకంపై సీనియర్‌ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవదర్శకుడు వెట్రిసెల్వన్‌ పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాలో ప్రశాంత్‌కు జంటగా సంచితశెట్టి నటిస్తోంది. ప్రభు, షియాజీ షిండే, ఆనంద్‌రాజ్, అశుతోష్‌ రాణా వంటి భారీ తారాగణం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న జానీ చిత్రంలో పాటలు లేకపోవడం విశేషం. ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనాలతో కూడిన ఇందులో పాటలు చిత్ర వేగానికి బ్రేక్‌ వేస్తాయన్న ఉద్దేశంతోనే వాటిని చిత్రంలో చొప్పించలేదని నిర్మాత త్యాగరాజన్‌ పేర్కొన్నారు.

చిత్ర టీజర్‌ ఇంతకు ముందే విడుదలై మంచి స్పందనను పొందగా, తాజాగా జానీ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 51 సెకన్లు నిడివి కలిగిన ఈ ట్రైలర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోందని చిత్ర వర్గాలు తెలిపారు. త్వరలోనే జానీ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ప్రశాంత్‌ చాలా కాలం తరువాత ఒక తెలుగు చిత్రంలో నటిస్తుండడం విశేషం. 

రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ప్రశాంత్‌ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర గురించి సామాజిక మాధ్యమాల్లో తక్కువ చేసి ప్రశాంత్‌కు ఇలాంటి పరిస్థితినా? అంటూ ప్రసారం వైరల్‌ అవుతోంది. ఇలాంటి ప్రసారాన్ని ప్రశాంత్‌ తండ్రి, జానీ చిత్ర నిర్మాత త్యాగారాజన్‌ తీవ్రంగా ఖండించారు. రామ్‌చరణ్‌ చిత్రంలో ప్రశాంత్‌ పోషిస్తున్న పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు