పార్తిబన్ కు సెన్సార్‌ షాక్‌!

24 Dec, 2016 02:03 IST|Sakshi
పార్తిబన్ కు సెన్సార్‌ షాక్‌!

నటుడు, దర్శకుడు పార్తిబన్ కు సెన్సార్‌బోర్డు షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు సెన్సార్‌ అనేది చాలా మందికి తలనొప్పిగా మారింది. అందుకు కారణం వినోదపు పన్ను రాయితీలే. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ అందించిన చిత్రాలకు వినోదపు పన్ను రాయితీలు వర్తించవు. యూ సర్టిఫికెట్‌లు కోసం చిత్ర దర్శక నిర్మాతలు ఆశించేది అందుకే. ఇటీవల సూర్య నటించిన ఎస్‌–3 చిత్రానికీ యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో ఆ చిత్ర నిర్మాత రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్తిబన్  తాజాగా స్వీయ దర్శకత్వంలో ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగా.

నటుడు శాంతను భాగ్యరాజ్, నటి పార్వతినాయర్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23నే విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని ఈ నెల 30కి వాయిదా వేసినట్లు సమాచారం. కోడిట్ట ఇడంగళై నిరప్పుగా చిత్రానికి సెన్సార్‌ యూ/ ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పార్తిబన్ తో సహా చిత్ర యూనిట్‌ షాక్‌కు గురైంది. అయితే ఈ విషయంలో రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలని భావించినా, అలాంటి నిర్ణయంతో చిత్ర విడుదల మరింత ఆలస్యం అవుతుందన్న భావనతో చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్‌తోనే విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.