ఇన్నుమ్‌ ఇరుక్కు!

10 Mar, 2019 00:26 IST|Sakshi
కమల్‌హాసన్‌, త్రిష, కేథరిన్‌, తమన్నా, ‘జయం’ రవి

ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్‌ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్‌లో గత ఏడాది రజనీకాంత్‌ ‘2.0’, కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం 2’, ధనుష్‌ ‘మారి 2’, విశాల్‌ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్‌ పడమ్‌ 2’ చిత్రాలు సీక్వెల్స్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాయి. ‘ఇన్నుమ్‌ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్‌ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్‌.. అదేనండీ.. రండి చూద్దాం.

లోకనాయకుడు కమల్‌హాసన్‌ సీక్వెల్స్‌పై స్పెషల్‌ కేర్‌ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్‌ ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌. సేమ్‌ కాంబినేషన్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్‌ 2’ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కథా నాయికగా నటిస్తున్నారు.

అలాగే 1992లో భరతన్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ‘దేవర్‌మగన్‌’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌హాసనే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్‌పై ఫుల్‌ కాన్సట్రేట్‌ చేశారు కమల్‌. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్‌ చేసిన హిట్‌ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని  ఒరువన్‌’ (2015)కు రీమేక్‌ అని తెలిసిందే. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు.

ఇప్పుడు ‘తని ఒరువన్‌’ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. సేమ్‌ మోహన్‌రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్‌ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్‌ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్‌ ముఖ్య తారలుగా ఏఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్‌. విజయ్‌ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు.

నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్‌లో. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్‌ సీక్వెల్‌ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్‌ కాదు. దురై దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్‌ మూవీగా జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మీ, క్యాథరీన్‌లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’.

ఈ సినిమా ‘బ్లఫ్‌ మాస్టర్‌’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్‌ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్‌ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రముఖ కమెడియన్‌ వడివేలు నటించిన ‘ఇమ్‌సై అరసన్‌ 23 ఆమ్‌ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇమ్‌సై అరసన్‌ 24 ఆమ్‌ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్‌లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్‌ డిఫరెన్స్‌ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్‌. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్‌ కూడా సెట్స్‌పై ఉన్నాయి.

ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్‌ సినిమాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్‌ దర్శక–నిర్మాతలు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్‌ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్‌ పార్ట్‌లో విజయ్‌ నటించగా, సీక్వెల్‌లో మాత్రం అజిత్‌ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్‌ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్‌ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో.


విశాల్‌,ధనుష్‌

అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్‌ ఇస్తున్నారు విశాల్‌. 2017లో వచ్చిన హారర్‌ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్‌కు మంచి హిట్‌ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్‌గా నటించిన ‘అరమ్‌’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్‌కు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్‌ రానున్నాయని కోలీవుడ్‌లో కొత్తగా కథనాలు వస్తున్నాయి.

‘గోల్‌మాల్, రేస్, ధూమ్, క్రిష్‌’ చిత్రాల సీక్వెల్స్‌ ఫ్రాంచైజ్‌లుగా మారాయి బాలీవుడ్‌లో. ఈ ట్రెండ్‌ మెల్లిగా సౌత్‌కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్‌మెంట్‌ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్‌ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్‌ సిరీస్‌లో ఫోర్త్‌ పార్ట్‌గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.


రాఘవ లారెన్స్‌

రాఘవ లారెన్స్‌తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్‌ కెరీర్‌కు మాస్‌ ఇమేజ్‌ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్‌ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్‌. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ల ట్రెండ్‌ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు