షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సెవెన్’

20 Apr, 2019 15:40 IST|Sakshi

ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనే ఇంట్రస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా సెవెన్‌. రమేష్‌ వర్మ స్వయంగా కథ అందించి ఈ సినిమాను నిర్మించారు. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ ‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్  ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు