విషాదంలో షారూక్‌ ఖాన్‌

11 Apr, 2019 19:52 IST|Sakshi

సాక్షి, ముంబై :  బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ విషాదంలో మునిగిపోయారు. ఫౌజీ టెలివిజన్‌ షోతో షారూక్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు కల్నల్ రాజ్ కపూర్ (87) కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని  రాజ్‌ కపూర్ కుమార్తె రితంబర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.  రాజ్‌కపూర్‌ మృతిపై పలువురు బాలీవుడ్‌ నటీనటులు, ఇతర ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

‘ప్రియమైన మా తండ్రిగారు రాజ్‌కుమార్‌ భువినుంచి దివికేగారం’టూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆయన కుమార్తె వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆయన వయసు సంబంధిత కారణాల రీత్యా అనారోగ్యానికి గురయ్యారనీ, చికిత్స పొందుతూ ఆకస్మాత్తుగా చనిపోయారనీ... గురువారం ఆయన అంత్యక్రియలు పూర్తి అయినట్టు రితంబర్‌ తెలిపారు.   

కాగా ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేసిన రాజ్‌కపూర్‌ ఓషో శిష్యరికం తీసుకున్నాక..ఆర్మీకి రిజైన్‌ చేసి ముంబైలో సెటిల్‌ అయ్యారు. అనంతరం అనేక టీవీ సీరియళ్లను నిర్మించారు, కొన్నింటిలో నటించారు కూడా. మూడు యుద్ధాల్లో పాల్గొన్నా, నటుడిగా , నిర్మాతగా రాణించినా  రాని గుర్తింపు 20 ఏళ్ల క్రితం పరిచయం చేసిన షారూక్‌ ​ఖాన్‌ ద్వారా లభించిందని సమార్‌ ఖాన్‌ రాసిన ‘ఎస్‌ఆర్‌కే 25 ఇయర్స్‌ ఆఫ్‌ ఏ లైఫ్‌’ అనే పుస్తకంలో  రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. అయితే సరియైన పాత్రకు, సరియైన వ్యక్తిని ఎంచుకోవడమే మాత్రమే తప్ప ఇందులో తన గొప్పతనమేమీ లేదని గుర్తు చేసుకున్నారు. అతని తల్లిదండ్రులే షారూక్‌ను సూపర్‌స్టార్‌గా మలిచారని తాను కాదని చెప్పారు.  

మరిన్ని వార్తలు