ఇంక్‌ చల్లుతామంటూ స్టార్‌ హీరోకి బెదిరింపులు

23 Nov, 2018 09:29 IST|Sakshi

ఈ నెల 27న మెన్స్‌ హాకీ వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ఒడిషాలోని కళింగ స్టేడియంలో ప్రారంభంకాబోతుంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ను ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌. అయితే తమకు క్షమాపణలు చెప్పకుండా.. షారుక్‌ ఈ వేడుకలకు హాజరైతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు స్థానిక కళింగ సేన నాయకులు. విషయం ఏంటంటే 17 ఏళ్ల క్రితం షారుక్‌ ఖాన్‌ ‘అశోక’ అనే చిత్రంలో నటించారు.

చరిత్ర గతినే కాక అశోకుని పథాన్ని మార్చిన కళింగ యుద్ధం నేపథ్యంలో వచ్చిన చిత్రం అశోక. 2001లో షారుక్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, జుహీ చావ్లా ప్రధాన ప్రాతధారులుగా సంతోష్‌ శివన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే అంటే 2001లోనే ఈ సినిమా పట్ల తీవ్ర నిరసలను వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం ఒడిషా సంస్కృతిని, ఆ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా ఉందని నిరసనల వ్యక్తం చేశారు. ఈ సినిమా ఒడిషాలో కేవలం వారం రోజుల పాటే నడించిందంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా విడుదలయ్యి దాదాపు 17 ఏళ్లు పూర్తయిన కూడా ఇప్పటికి షారుక్‌ పట్ల నిరసనలు వ్యక్తమవుతుండటం ఆశ్చర్యం.

ఈ క్రమంలోనే కళింగ సేన షారుక్‌కు బెదరింపు సందేశాలు పంపుతోంది. మీ అశోక సినిమాలో మా రాష్ట్ర ప్రజలను కించపరిచేలా చూపించారు.  ఇందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. లేదంటే మీ మీద ఇంక్‌ చల్లడమే కాక నలుపు రంగు జెండా ఎగురవేసి నిరసనలు తెలుపుతాం. మా కార్యకర్తలు దారి పొడవునా ఉంటారు జాగ్రత్త అంటూ షారుక్‌ని బెదిరిస్తూ ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు