కరోనా: నిబంధనలు ఉల్లంఘించిన హీరో!

18 Mar, 2020 17:27 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ముంబై: చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకీ దీని ప్రభావం మరింతగా ప్రబలుతోంది. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రజలకు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను ఆయన ఉల్లంఘించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని స్కూళ్లు, కాలేజీలు, మాల్స్‌, జిమ్‌లను మూసి వేయాలని నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే షాహిద్‌ కపూర్‌ ఆ నిబంధనలకు విరుద్ధంగా బాంద్రాలోని యాంటీ గ్రావిట్ క్లబ్‌లో మూసి ఉన్న జిమ్‌ను తెరిచి మరీ వ్యాయామం చేశారు. ఆ సమయంలో భార్య మీరా కూడా ఆయనతో పాటు ఆ జిమ్‌లో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మూసివేసిన జిమ్‌ను సాయంత్ర సమయంలో తెరిచి ఈ హీరో వ్యాయామం చేసినట్లు పేర్కొంది.

కాగా ఈ విషయం మీడియాకు తెలియడంతో జిమ్‌ వెనకవైపు ఉన్న డోర్‌ నుంచి  వారు వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం గురించి జిమ్‌ యజమాని జయసింగ్‌ మాట్లాడుతూ.. షాహిద్‌ కపూర్‌ తనకు మంచి స్నేహితుడని.. జిమ్‌ దగ్గరకి షాహిద్‌ వర్క్‌ చేయానికి రాలేదని అన్నారు. షాహిద్‌ తనతో మాట్లాడటానికే జిమ్‌కు వచ్చాడని జయసింగ్‌ తెలిపాడు.  

మరిన్ని వార్తలు