నుదుటన తిలకంతో షారూఖ్‌.. నెటిజన్ల ఫైర్‌

29 Oct, 2019 12:40 IST|Sakshi

ముంబై : దీపావళి సందర్భంగా సెలబ్రిటీలు తమ అభిమానులకు విషెస్‌ చెప్పడం సాధారణమే. అయితే బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ట్విటర్‌ వేదికగా చెప్పిన దీపావళి విషెస్‌ పెద్ద దుమారాన్నే రేపాయి. కింగ్‌ఖాన్‌ను ట్రోల్స్‌ బారిన పడేలా చేశాయి. షారూఖ్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌, కుమారుడు అబ్రామ్‌తో కలిసి నుదుటన తిలకం ఉన్న ఫోటోను షేర్‌ చేయడమే ఇందుకు కారణం. ‘ముస్లిం మతస్తుడివి అయి ఉండి ఒక ఫోటో కోసం ఇలా తిలకం పెట్టుకుంటావా’ అంటూ కొంతమంది నెటిజన్లు షారూఖ్‌పై విరుచుకుపడుతున్నారు. అతడిని వ్యతిరేకిస్తూ ట్విటర్‌లో అక్కసు వెళ్లగక్కుతున్నారు. 

ఈ నేపథ్యంలో షారూఖ్‌పై  వస్తున్న ట్రోల్స్‌పై  ప్రముఖ బాలీవుడ్‌ నటి అజ్మి షబానా స్పందించారు. కేవలం తిలకం పెట్టుకున్నంత మాత్రాన షారూఖ్‌ను ఫేక్‌ముస్లిం అని నిందించడం దారుణమన్నారు. ‘ప్రతీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. భారతీయ అందమైన సంప్రదాయమైన తిలకం పెట్టుకున్నంత మాత్రాన ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇస్లాం మరీ అంత బలహీనమైనది కాదు. గంగా జమునా సంగమంలోనే భారత నిజమైన అందం దాగుంది’ అని ట్రోల్స్‌కు చురకలు అంటించారు. అయినా వెనక్కి తగ్గని ట్రోలర్స్‌ షారుఖ్‌కి సపోర్ట్‌ చేసినందుకు షబానాను కూడా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా షారూఖ్‌కు ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. గతంలో గణేష్‌ చతుర్థి సందర్భంగా తన నివాసం ‘మన్నత్‌’లో అబ్రం వినాయకుడిని పూజిస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసినందుకు గానూ ముస్లిం నెటిజన్లు అతడిని తీవ్రంగా విమర్శించారు.

మరిన్ని వార్తలు