మా ఆవిడ వార్నింగ్‌ ఇచ్చింది

29 Jun, 2018 00:14 IST|Sakshi
శంకర్

‘హీరో అయిపోవాలని సినిమా చేయలేదు. పని లేక ఖాళీగా ఉండటం ఇష్టం లేక హీరోగా ‘శంభో శంకర’ సినిమా స్టార్ట్‌ చేశా. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హిట్‌ సినిమా తర్వాత నేను అనుకున్న రేంజ్‌ సినిమాలు రాలేదు. కొన్ని నా మనసుకు నచ్చలేదు. మనసుకు సంతృప్తినిచ్చే క్యారెక్టర్స్‌ రాలేదు’’ అని శంకర్‌ అన్నారు. శంకర్, కారుణ్య జంటగా శ్రీధర్‌ ఎన్‌. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శంభో శంకర’. రమణా రెడ్డి, సురేశ్‌ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శంకర్‌ పంచుకున్న విశేషాలు...

► దొంగతనం చేయడానికి భయం ఉండాలి. అవకాశాలు ఇవ్వమని అడగడానికి భయమెందుకు?  నా వద్ద కథ ఉంది, డైరెక్టర్‌ ఉన్నాడు సినిమా నిర్మించమని త్రివిక్రమ్‌గారు, రవితేజగారు, ‘దిల్‌’ రాజుగారి దగ్గరికి వెళ్లాను. వాళ్లు ఎవ్వరూ చేయం అని అనలేదు. కానీ, టైమ్‌ పడుతుంది అన్నారు. పని లేకుండా ఉండటం నా వల్ల కాదు. అందుకే ఈ సినిమా స్టార్ట్‌ చేశాం.   

► ‘శంభో శంకర’ కథను నేను, శ్రీధర్‌ కలిసి తయారు చేసుకున్నాం. ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కూడా నేనే (నవ్వుతూ). ఈ సినిమాని అందరం ప్రేమించి పనిచేశాం. శంకర్‌ హీరో ఏంటి? అని తక్కువగా చూడలేదు. ఒక్క సీన్‌కి కాదు.. ఈజీగా పది సన్నివేశాలకు ప్రేక్షకులు క్లాప్స్‌ కొడతారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు రమణారెడ్డిగారికి, సురేశ్‌ కొండేటిగారికి ధన్యవాదాలు.

► మొన్నటి దాకా ఆర్థికంగా అందరికీ సహాయపడుతుండే వాణ్ణి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నా. మా ఆవిడ వార్నింగ్‌ కూడా ఇచ్చింది (నవ్వుతూ). క్యారెక్టర్‌ అడుగుదాం అని వెళ్తే అక్కడే ఓ పది మంది ఉంటారు ఇంకేం అడుగుతాం. హీరోగానే కాదు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తా. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రం చేశా.

మరిన్ని వార్తలు