సమాజానికి కేడీ సందేశం

11 Jun, 2019 03:07 IST|Sakshi
షకలక శంకర్‌

హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన షకలక శంకర్‌ ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు, ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న శంకర్‌ నటించిన తాజా చిత్రం  ‘నేనే కేడీ నెం–1’. ఆర్‌ ఏ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎండి రవూఫ్‌ సమర్పణలో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్‌ జరుపుకుంటోంది. ఈ నెల చివరి వారంలో సినిమాని విడుదల చేస్తున్నారు. దర్శక–నిర్మాత జాని మాట్లాడుతూ– ‘‘మంచి ఎంటర్‌టైనర్‌తో వస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది.

ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులు కూడా. నేటి బిజీలైఫ్‌లో పిల్లలను  పట్టించుకోకుండా, బాధ్యతలు తెలపకుండా  పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, గాలికి  వదిలేస్తున్నారు. ఈ క్రమంలో యువత పెడదోవ పడుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. తల్లిదండ్రులతోపాటు పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులకు కావాల్సిన వాణిజ్య అంశాలన్నీ జోడించాం. ముస్కాన్‌ అందం, అభినయం, ముకుల్‌ దేవ్, పృథ్వీ పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. పూజా, పి.డి.రాజు, కరాటే కళ్యాణి, రామ్‌ జగన్, రాజేందర్, నాగ మహేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి  సంగీతం: అజయ్‌ పట్నాయక్,  కెమెరా: శ్రావణ్‌ కుమార్‌.
 

మరిన్ని వార్తలు