ఈ జర్నీ ఫుల్ హ్యాపీ!

5 Mar, 2016 23:18 IST|Sakshi
ఈ జర్నీ ఫుల్ హ్యాపీ!

‘‘మంచి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటే అప్పుడు అమలు చేసేస్తా. ఇప్పుడు నా మనసులో ఉన్నది ఒక్కటే. ఎప్పటిలా మంచి సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేయాలి’’ అని హీరో శర్వానంద్ అన్నారు. ‘రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా’ - ఇలా ఈ మధ్య శర్వా నంద్ చిత్రాలన్నీ హిట్టే. డిఫరెంట్ స్టోరీస్ సెలక్ట్ చేసు కుని, విభిన్న పాత్రలు చేస్తూ ముందుకెళుతున్న శర్వానంద్ పుట్టిన రోజు నేడు. మీడియాతో ఆయన పంచుకున్న కబుర్లు...

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకూ నేను 24 సినిమాలు చేశాను. నా 25వ సినిమాకి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. కేశినేని నానిగారి తమ్ముడు చిన్ని నాకోసం కథ రాస్తున్నారు. మరో ముగ్గురు దర్శకులు కూడా కథలు రెడీ చేస్తున్నారు. వీటిలో ఏది ముందు మొదలవుతుందో త్వరలో చెబుతాను.

శర్వానంద్ మంచి సినిమాలు చేస్తాడు.. ఏ పాత్రైనా చేయగలుగుతాడు అని గుర్తించి, నాతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. హీరోగా నా జర్నీ ఇలా సాగుతున్నందుకు హ్యాపీగా ఉంది.

నాతో సినిమా చేసే నిర్మాతలే నా పారితోషికం పెంచుతున్నారు. నాకింత కావాలని ఎవర్నీ డిమాండ్ చేయలేదు. అలాగే, బడ్జెట్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచమంటాను. మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం నాకు నచ్చదు.

నాకు థ్రిల్లర్ మూవీస్ చేయాలని ఉంది. అలాగే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఇష్టం. మణిరత్నం, రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ వంటి దర్శకులతో సినిమాలు చేయాలని ఉంది. పూరి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఎప్పుడో ఐదేళ్ల కింద చేసిన ‘ఏమిటో ఈ మాయ’ సినిమాని ఇప్పుడు ‘రాజాధి రాజా’గా విడుదల చేస్తున్నారట. అంతకు మించి ఈ సినిమా డీటైల్స్ నాకు తెలియవు.