చెన్నై పక్కమ్‌ వాంగ

4 May, 2019 03:48 IST|Sakshi
శర్వానంద్‌

చెప్పాల్సిన కథలో రీచ్‌ ఎక్కువున్నప్పుడు బైలింగువల్‌ (ద్విభాషా చిత్రం) ప్లాన్‌ చేస్తారు హీరోలు. ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నారు శర్వానంద్‌. త్వరలోనే ఓ బైలింగువల్‌ చిత్రాన్ని పట్టాలెక్కించి చెన్నై టు హైదరాబాద్‌ ప్రయాణం చేస్తారట శర్వా. డ్రీమ్‌ వారియర్‌ బ్యానర్‌పై నిర్మాత యస్‌. ఆర్‌. ప్రభు తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. నూతన దర్శకుడు తయారు చేసిన ఈ కథలో హీరోగా నటించడానికి శర్వానంద్‌ ఓకే చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం శర్వానంద్‌ ‘96’ రీమేక్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘96’ రీమేక్‌ తర్వాత ఈ ద్విభాషా చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

ఆల్రెడీ తమిళంలో కొన్ని సినిమాలు చేసి తమిళ ప్రేక్షకులను పలకరించారు శర్వా. ‘గమ్యం’ తమిళ రీమేక్‌ ‘కాదల్‌ సుమ్మా ఇల్లై, నాళై నమదే, ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్, జేకే ఎనుమ్‌ నన్‌బన్‌ వాళ్కై’ అనే సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తమిళంలో చెన్నై పక్కమ్‌ వాంగ (చెన్నై వైపు రండి) అని పలు అవకాశాలు వచ్చినా శర్వా తెలుగు చిత్రాలకే పరిమితం అయ్యారు. ఈ సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా రిలీజ్‌కు రెడీగా అవుతోంది.

మరిన్ని వార్తలు