చెన్నై: 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి హిట్ చిత్రం ఇచ్చిన దర్శకుడుమేర్లపాక గాంధీ టాలీవుడ్ విలక్షణ హీరో శర్వానంద్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన అప్ కమింగ్ మూవీ 'ఎక్స్ ప్రెస్ రాజా' లో అద్భుతమైన నటనతో శర్వానంద్ తనను షాక్ కు గురి చేశాడన్నాడు. చాలా టాలెంటెడ్ యాక్టర్ అని తెలిసినా...సెట్లో తనను తానును ఇంత బాగా మలుచుకుంటాడని అస్సలు ఊహించలేదంటూ ఉబ్బితబ్బిబు అవుతున్నాడు.
అమోఘమైన శర్వానంద్ పెర్ఫామెన్స్కు నిర్ఘాంతపోయానంటూ గాంధీ చెప్పుకొచ్చాడు. చాలా సన్నివేశాలలో అతని నటన తాను ఊహించినదానికంటే కూడా చాలా బావుందన్నాడు. శర్వానంద్ ని డైరెక్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేశానంటున్నాడు. ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారంటూ పొగడ్తల్లో ముంచెత్తేశాడు. శర్వానంద్ లాంటి నటుడితో పనిచేయడం మంచి అనుభవాన్ని మిగిల్చిందని వ్యాఖ్యానించాడు దర్శకుడు.
మరోవైపు కథను బట్టి సినిమాకు ఆ పేరు పెట్టాను తప్ప తనకు ' ఎక్స్ ప్రెస్' సెంటిమెంట్ లేదని స్పష్టం చేశాడు. అలాగే కథను బట్టి హీరో తప్ప, హీరోకు అనుగుణంగా కథ తయారు చేయడం తనకు నచ్చదని వ్యాఖ్యానించాడు. ప్రతి ఇరవై నిమిషాలకో ఆశ్చర్యకరమైన ట్విస్ట్ తో , విభిన్నమైన కథనంతో తెలుగులో వస్తున్న ఎక్స్ప్రెస్ రాజా అందరినీ ఆకట్టుకోవడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశాడు.
కాగా జనవరి 14న సరిగ్గా సంక్రాంతి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆడియోకు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ గా సురభి హరీష్ ఉత్తమన్, బ్రహ్మాజీ, పోసాని మురళి, తదితరులు నటించారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు శర్వానంద్.