విడిపోయిన మనసుల్ని కలిపే ప్రేమ

11 May, 2014 22:39 IST|Sakshi

ప్రేమలో నిజాయితీ ఉంటే... ప్రేమికులు భౌతికంగా విడిపోయినా.. కచ్చితంగా మళ్లీ కలుస్తారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కథ  సింపుల్‌గా ఇదే. పరిణతి చెందిన ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు కె.ఎ.వల్లభ నిర్మాత. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి సమర్పకుడు కె.ఎస్.రామారావు చెబుతూ- ‘‘మా క్రియేటివ్ కమర్షియల్ సంస్థ నుంచి వచ్చిన మంచి సినిమాల జాబితాలో చేరే సినిమా ఇది. దర్శకుడు కావ్యంలా సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
 
 విశాఖ సముద్ర తీరంలో 50 లక్షల భారీ వ్యయంతో వేసిన సెట్‌లో తీసిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. తొలి షెడ్యూల్‌తో యాభై శాతం టాకీ, ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. జూన్ తొలివారంలో రెండో షెడ్యూల్ ఉంటుంది’’ అని తెలిపారు. ప్రేమ, కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శర్వా, నిత్యాల జంట కొత్తగా ఉంటుందని, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫేం బుర్రా సాయిమాధవ్ సంభాషణలు కథకు ప్రాణం పోశాయని క్రాంతిమాధవ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జ్ఞానశేఖర్, కూర్పు: మధుసూదనరెడ్డి.