నా కథకి ఆమే బెస్ట్‌!

5 Jul, 2017 01:10 IST|Sakshi
నా కథకి ఆమే బెస్ట్‌!

తమిళసినిమా: నటి ఐశ్వర్యరాజేశ్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయని చెప్పవచ్చు. ఈమెది హీరోయిన్‌ పాత్రలు చేసే వయసే. అయినా అలాంటి పాత్రలే చేస్తానని పట్టు పట్టకుండా నటనకు అవకాశం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం అనడంతో వైవిధ్యభరిత పాత్రలు ఆమె వైపు చూస్తున్నాయి. అందుకు కాక్కాముట్టై చిత్రంలో పోషించిన ఇద్దరు పిల్లలకు తల్లి పాత్ర ఒక ఉదాహరణ మాత్రమే. తాజాగా శశికుమార్‌కు జంటగా కొడివీరన్‌ చిత్రంలో నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్‌కు మరో అవకాశం తలుపు తట్టనుంది. ఆరోహణం చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తిన నటి లక్ష్మీరామకృష్ణన్‌ తొలి చిత్రంతోనే మంచి మార్కులను కొట్టేశారు.

ఆ తరువాత అమ్మణి చిత్రాలను తెరకెక్కించిన ఈ మహిళాదర్శకురాలు తాజా చిత్రానికి రెడీ అయ్యారు. ఇటీవల అనూహ్య విజయాన్ని సాధించిన హిందీ మీడియం అనే హిందీ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథను తయారు చేసుకున్నారట. నిజానికి ఆ చిత్ర రీమేక్‌ హక్కులనే పొందాలని భావించినా అదీ బెంగాలీ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రం అని తెలియడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని తనూ హిందీ మీడియం చిత్ర స్ఫూర్తితో ఒక కథను రాసుకున్నారట. కాగా ఇందులో అశోక్‌ సెల్వన్‌ కథానాయకుడిగా నటించనున్నారు.

ఇక కథానాయకి విషయానికి వస్తే నటి మంజిమామోహన్, నందిత శ్వేత, ఐశ్వర్యరాజేశ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అయితే ఈ ముగ్గురిలో ఐశ్వర్యరాజేశ్‌నే తన కథలో నాయకి పాత్రకు బాగా నప్పుతారని దర్శకురాలు లకీ‡్ష్యరామకృష్ణన్‌ నమ్ముతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఐశ్వర్యరాజేశ్‌ మన తెలుగమ్మాయే అన్నది గమనార్హం.