‘అది చెప్పినందుకే.. సినిమా అవకాశాలు రాలేదు’

25 Sep, 2018 20:54 IST|Sakshi

ముంబై:  ఆషిక్‌ బనాయా అప్నేతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి గళం విప్పారు. 2008లో ఓ నటుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘క్యాస్టింగ్‌ కౌచ్‌పై హాలీవుడ్‌లో మీటూ ఉద్యమం రెండేళ్ల క్రితం ప్రారంభమై ఉంటుంది. కానీ భారత్‌లో నేను చాలా ఏళ్ల క్రితమే దానిని ప్రారంభించాను. ఇక్కడ తొలిసారి క్యాస్టింగ్‌ కౌచ్‌పై మాట్లాడింది, లైగింక వేధింపులపై ఉద్యమం చేసింది నేనే. 2008లో హార్న్‌ ఒకే ప్లీజ్‌ సినిమా చిత్రీకరణ సమయంలో నాతో ఒక నటుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాంగ్‌ షూటింగ్‌లో నా చేతులను తాకుతూ.. కొరియోగ్రాఫర్లను పక్కకు జరగమని చెప్పాడు. నాకు డ్యాన్స్‌ అతడే నేర్పుతానని అన్నాడు. ఈ విషయాన్ని అప్పుడే మీడియాకు వెల్లడించాను. మూడు రోజుల పాటు నాకు జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా చానళ్లలో చూపించారు. కానీ ప్రస్తుతం దాని గురించి ఎవరు మాట్లాడటం లేద’ని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు జరిగిన అన్యాయాన్ని టీవీల్లో చూసినప్పటికీ బాలీవుడ్‌కు చెందిన ఏ ఒక్కరు కూడా స్పందించలేదని వాపోయారు. ఆ సమయంలో తనకు ఎదురైన వేధింపుల గురించి మీడియా ముందుకువచ్చినందుకు.. ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు రాలేదని తనుశ్రీ తెలిపారు. ఇది ఇప్పటికీ ఓ గాయంగా మిగిలిపోయిందని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఆషిక్‌ బనాయా అప్నే తర్వాత ఆమె ‘చాకోలేట్‌’, ‘రఖీబ్‌’, ‘ధోల్‌’, ‘రిస్క్‌’, ‘గుడ్‌బాయ్‌ బ్యాడ్‌బాయ్‌’ వంటి హిందీ చిత్రాల్లో నటిచండమే కాక తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యతో జత కట్టారు. 2010లో వచ్చిన అపార్ట్‌మెంట్‌ ఆమె నటించిన చివరి సినిమా. కొంతకాలం పాటు అమెరికాలో ఉన్న ఆమె ఈ ఏడాది జూలైలో ఇండియాకు తిరిగి వచ్చారు. ఇటీవల రాధిక అప్టే, రిచా చద్డా, స్వర భాస్కర్‌ వంటి వారు కూడా తమకు ఎదురైన లైంగిక వేధింపులపై స్పందించారు.

మరిన్ని వార్తలు