విలన్‌గానూ చేస్తా

22 Aug, 2019 03:17 IST|Sakshi
శేఖర్‌ వర్మ

‘‘నేను ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా నటించగలనని నా నమ్మకం. అందుకే ఆ జానర్‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నాను. కేవలం హీరోగానే కాదు పాత్ర ప్రాధాన్యతను బట్టి విలన్‌గా నటించడానికి కూడ సిద్ధమే. నటుడిగా నాకు రజనీకాంత్‌గారు ఫేవరెట్‌’’ అన్నారు శేఖర్‌ వర్మ. ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ ఫేమ్‌ శేఖర్‌ వర్మ హీరోగా నటించిన చిత్రం ‘నివాసి’. కె.ఎన్‌.రావు, టీవీవీఎస్‌ఎన్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. శేఖర్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా యాక్టర్‌ అయ్యాను.

కానీ ఆ తర్వాత నటనపై ఆసక్తి పెంచుకున్నాను. ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’లో హీరోగా నటించిన తర్వాత బాలకృష్ణగారు హీరోగా చేసిన ‘జై సింహా’లో ఓ పాత్ర చేశాను. ‘నివాసి’లో మూలాలను వెతుక్కుంటూ ఇండియాకు వచ్చే హీరో పాత్ర నాది. తండ్రీకొడుకుల భావోద్వేగ సన్నివేశాలు అలరిస్తాయి. ‘అంగుళిక’ చిత్రంలో లీడ్‌ రోల్‌ చేశాను. ఇందులో ప్రియమణి కీలకంగా నిలిచే చిన్న పాత్ర చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ‘యుగన్‌’ అనే మూవీ, బాలకృష్ణగారి తాజా సినిమాలో పోలీసాఫీసర్‌గా, గాయత్రి ప్రొడక్షన్స్‌లో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు