రేడియో జాకీగా హీరోయిన్

30 May, 2015 13:04 IST|Sakshi
రేడియో జాకీగా హీరోయిన్

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇపుడు మరో కొత్త అవతారంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.   ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి బాలీవుడ్ బిగ్ స్క్రీన్ నుంచి తప్పుకొని 2007లో 'సెలబ్రిటి బిగ్ బ్రదర్'లో ప్రత్యక్షమై ఇటు భారతీయ ప్రేక్షకులతోపాటు అటు లండన్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.  అభిమానులను ఆకట్టుకోవడంలో తన స్టైలే వేరని నిరూపించుకున్న శిల్పాశెట్టి  ఇప్పుడు లండన్‌లో రేడియో జాకీగా  తన టాలెంట్ను ప్రదర్శించబోతోంది.

శిల్పాశెట్టి లండన్ ప్రేక్షకులకు  బాలీవుడ్‌ను బీబీసీ రేడియో-2 ద్వారా తనదైన శైలిలో సరికొత్త రూపంలో పరిచయం చేయబోతోంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్‌లో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న ఆమె  ఈ కార్యక్రమం సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందని శనివారం ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలిపింది. ఈ సందర్భంగా రెండు ఫొటోలను కూడా ఆమె 'ది న్యూ ఆర్జే ఇన్ ది హౌస్'  పేరిట ఫొటో వెబ్‌సైట్ 'ఇన్‌స్టాగ్రామ్'లో పోస్ట్ చేసింది.

శిల్పా శెట్టి తన బీబీసీ రేడియో-2 కార్యక్రమం తొలి ఎపిసోడ్‌ల కోసం అప్పుడే మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్, బాలీవుడ్ ఎంటర్టైన్‌మెంట్ మాస్టర్ కరన్ జోహర్‌తో మాటామంతి జరిపారు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సహ యజమానిగావున్న ఆమె ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌గా రాణిస్తూ  యోగాకు సంబంధించిన పలు క్యాసెట్లను రిలీజ్ చేసింది. 'స్పా, వెల్‌నెస్ సెంటర్ల చైన్'ను నిర్వహించడంతోపాటు నగల వ్యాపారంలో రాణిస్తోంది.   అంతేనా ఏ కాస్త కాళీ దొరికినా బిగ్‌బాస్, నాచ్ బాలియే లాంటి బుల్లి తెర షోలకు జడ్జీగా, అతిథిగా శిల్పాశెట్టి  బుల్లితెరపై మెరుస్తోంది.