ప్రచారం కోసమే శిల్పాశెట్టిపై కేసు పెట్టారు

28 Apr, 2017 16:16 IST|Sakshi
ప్రచారం కోసమే శిల్పాశెట్టిపై కేసు పెట్టారు

ముంబై: మీడియాలో ప్రచారం పొందడానికే బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిపై క్రిమినల్‌ కేసు పెట్టారని ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా ఆరోపించారు. తమపై కేసు పెట్టిన ఓ టెక్స్‌టైల్స్‌ సంస్థ యజమాని పలు చోట్ల తన పరిచయాలను దుర్వినియోగం చేశాడని కుంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు తనకు 24 లక్షల రూపాయలు మోసం చేశారని టెక్స్‌టైల్స్ సంస్థ యజమాని వారిపై క్రిమినల్‌ కేసు పెట్టారు. మహారాష్ట్రలోని థానెలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తాను మోసం చేయలేదని, ఈ వ్యవహారం సివిల్‌ విషయమని, ఆయనతో చేసుకున్న వ్యాపార ఒప్పందం రద్దయ్యిందని కుంద్రా చెప్పారు. ఈ వ్యాపార లావాదేవీల్లో శిల్పాశెట్టికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. మీడియాలో ప్రచారం పొందేందుకు ఆమె పేరును ఈ కేసులోకి లాగారని కుంద్రా ఆరోపించారు.