ముహూర్తం కుదిరింది

28 Nov, 2013 03:25 IST|Sakshi
ముహూర్తం కుదిరింది
నటుడు శింబు, నయనతారల పునర్ కలయికకు ముహూర్తం కుదిరింది. ఈ జంట కలయికను ఇంత విశేషంగా చెప్పుకోవడానికి కారణం తెలియంది కాదు. ఇంతకుముందు నువ్వు లేక నేను లేను అన్నంతగా ప్రేమించుకున్న శింబు, నయనతార ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2006లో వల్లవన్ చిత్రం షూటింగ్ సమయంలో వీరి ప్రేమకు బీజం పడింది. కొన్ని నెలలకే ఆ ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది. ఏడేళ్ల తర్వాత ఈ మాజీ ప్రేమికులు కలిసి డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు.
 
  పాండిరాజ్ దర్శకత్వంలో శింబు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ ఈ జంట కలయికకు డిసెంబర్ ఐదున ముహూర్తం కుదిరింది. ఆ రోజున వీరిద్దరూ నటించే సన్నివేశాలను దర్శకుడు పాండిరాజ్ చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్ పెరిగిపోయింది. బయ్యర్లు అప్పుడే చిత్ర కొనుగోలుకు పోటీ పడుతున్నారట. పడరా మరి సంచలనాలకు కేంద్రబిందువు అయిన జంట నటిస్తున్న చిత్రం కదా!