‘అవినీతి నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా’

3 Sep, 2018 12:54 IST|Sakshi

మా అధ్యక్షుడు శివాజీ రాజా

‘మా’లో విభేదాలు లేవన్న సభ్యులు 

సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినయోగం అయ్యాయంటు ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో వివాదం నెలకొంది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో మా కార్యవర్గం స్పందించింది. సోమవారం సమావేశమైన సభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. మా అసోసియేషన్‌ డబ్బులతో  ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని, ఫోన్‌ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు. ‘నా పిల్లల మీద ఒట్టు..నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని నిరూపిస్తే నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తాను.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారని, వాళ్లు తాము చేసే ప్రతి పనిని తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

మా నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: హీరో శ్రీకాంత్‌
తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హీరో శ్రీకాంత్‌ అన్నారు. మా అసోసియేషన్‌ జూబ్లీ ఇయర్‌ సందర్భంగా నూతన బిల్డింగ్‌ కట్టబోతున్నామని తెలిపారు. దీని కోసం మెగాస్టార్‌ చిరంజీవిని కలిసామని ఆయన రెండు కోట్ల డొనేషన్‌ ఇస్తానని, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఫండ్స్‌ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేసామని, చిరంజీవి ఛీప్‌ గెస్ట్‌గా వచ్చారని తెలిపారు. తరువాత స్టార్‌ హీరోలు మహేశ్‌ బాబు, ప్రభాస్‌లు వస్తారని చెప్పారు.

సైరా షూటింగ్‌ వల్ల ఒక్క ప్రొగ్రామ్‌కే చిరంజీవిగారు వచ్చారని, దీంతో కోటిరూపాయలు వచ్చాయన్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం కోటి రూపాయలే ఇస్తామన్నారని, ఈవెంట్‌ మేనేజర్లకు ఎక్కువ వస్తే తమేం చేస్తామని ప్రశ్నించారు. చిరంజీవి స్టామినాను ఎవరు తక్కువ చేయలేరని, ఆయన అమెరికాలో ఈవెంట్స్‌కు రారని ప్రచారం చేశారన్నారు. మా అసోసియేషన్ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని స్పష్టం చేశారు. తన మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని శ్రీకాంత్‌ సవాల్‌ విసిరారు. మా అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయని పరుచూరి వెంకటేశ్వరావు తెలిపారు.

మరిన్ని వార్తలు