షార్ట్ ఫిల్మ్ తీయబోతే...?

21 Mar, 2016 02:30 IST|Sakshi
షార్ట్ ఫిల్మ్ తీయబోతే...?

‘‘మంచి సినిమాలకెప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్ర నిర్మాత వరుణ్ మా కజిన్ . ‘ముసుగు’ అనే సినిమా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉండగానే, కొత్త చిత్రం ప్రారంభించడంతో నాకు ఆశ్చర్యమేసింది’’ అని నిర్మాత సురేశ్‌బాబు పేర్కొన్నారు. శ్రీనివాస రెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు బార్బీ, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో వేద ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై శ్రీకరబాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత అశోక్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా మరో నిర్మాత టి. ప్రసన్న కుమార్ క్లాప్ కొట్టారు.

ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ కళాశాల నేపథ్యంలో జరిగే కథ ఇది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వైజాగ్ వెళ్లిన విద్యార్థులకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సస్పెన్స్ అంశం చుట్టూ ఈ చిత్రం నడుస్తుంది’’ అన్నారు. దర్శకుడు, నటుడు రాంబాబు, సంగీత దర్శకుడు అమోఘ్ దేశ్‌పతి, పాటలు, మాటల రచయిత ‘గంగోత్రి’ విశ్వనాథ్ మాట్లాడారు.