శ్రద్ధ ఓపెన్‌ టాక్‌

22 Apr, 2019 10:32 IST|Sakshi

తమిళసినిమా: మనసులో అనిపించింది అలానే బయటకు చెప్పేస్తే ఒక్కోసారి బెడిసి కొడుతుంది. అందుకే ఏ విషయాన్నైనా ఆచితూచి మాట్లాడాలంటారు పెద్దలు. నటి శ్రద్ధా శ్రీనాథ్‌ అలా నోరు జారే అభిమానుల ఆగ్రహానికి గురైంది. కథానాయకిగా ఎదుగుతున్న నటి శ్రద్ధాశ్రీనాథ్‌. కన్నడంలో ఈ బ్యూటీ నటించిన యూటర్న్‌ మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక తమిళంలోనూ శ్రద్ధాశ్రీనాథ్‌ నటించిన ఇవన్‌ తంద్రిరన్, విక్రమ్‌వేదా చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి. ముఖ్యంగా విక్రమ్‌వేదా కోలీవుడ్‌లో శ్రద్ధాశ్రీనాథ్‌కు ల్యాండ్‌మార్క్‌ చిత్రంగా నిలిచిపోయింది.

తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి జెర్సీ చిత్రంతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసేసుకుంది. ఇంత వరకూ బాగానే ఉంది. బహుభాషా నటిగా మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఒక భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్‌ చేయడం అన్నది సహజం. అలా కన్నడంలో శ్రద్ధాశ్రీనాథ్‌ నాయకిగా నటించిన యూటర్న్‌ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో రీమేక్‌ చేశారు. ఇందులో శ్రద్ధాశ్రీనాథ్‌ పాత్రను నటి సమంత పోషించింది. ఇమె ఇష్టపడి చేసిన పాత్ర ఇది. ఆ పాత్రలో నటించి మంచి పేరే తెచ్చుకుంది.

కాగా శ్రద్ధాశ్రీనాథ్‌ ఇటీవల ఒక భేటీలో  సమంత నటించిన యూటర్న్‌ చిత్రం గురించి చేసిన కామెంట్‌ సమంత అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది. ఇంతకీ శ్రద్ధాశ్రీనాథ్‌ ఏమందంటే నేను నా గురించి ఎక్కువగానే ఊహించుకుంటాను. యూటర్న్‌ రీమేక్‌ చిత్రాన్ని పూర్తిగా చూడాలని భావించాను. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువ చూడలేకపోయాను. ఎందుకంటే నేను నటించిన రక్షణ పాత్రలో వేరే నటి(సమంత)ని ఊహించలేకపోయాను అని అంది. ఇలా తన మనసుకు అనిపించింది బయటకు చెప్పడంతో సమంత నటన ఈ అమ్మడికి నచ్చలేదనే అర్థం స్పురించడంతో సమంత అభిమానులకు రుచించలేదు. దీంతో వారు నటి శ్రద్ధాశ్రీనాథ్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు.

మరిన్ని వార్తలు