ప్రతి నాయకిగా శ్రియ

5 May, 2017 01:14 IST|Sakshi
ప్రతి నాయకిగా శ్రియ

నరకాసురన్‌కు నటి శ్రియ విలన్‌గా మారనుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. శ్రియకు మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. చారిత్రాత్మక కథా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణకు జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, టాలీవుడ్‌లో మరోసారి అదే హీరోతో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో శింబుతో ‘అన్బానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌’ చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. కాగా తాజాగా ప్రతినాయకిగా మారడానికి ఏ మాత్రం సంకోచించకుండా నరకాసురన్‌ అనే చిత్రంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్లితే ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం దృవంగళ్‌ పదునారు.

దీనికి సృష్టికర్త నవ దర్శకుడు కార్తీక్‌నరేన్‌. తొలి చిత్రంతోనే శభాష్‌ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్‌. ఇందులో అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యవ కథానాయకుడిగా టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్య నటించడానికి అంగీకరించినా, ఇప్పుడు ఆయన వైదొలగినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. కారణం ఆయన త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. ఆయన పాత్రలో మరో టాలీవుడ్‌ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకిగా శ్రియ నటించనున్నారట.

కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధం అనేసిందట. మరో విషయం ఏమిటంటే ఆ చిత్ర కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట.అయితే చిత్ర దర్శకుడు కార్తీక్‌నరేన్‌ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నారని తెలిసింది. చిత్ర షూటింగ్‌ ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.