అజయ్‌ దేవగన్‌కి జోడీగా శ్రియ

9 Jun, 2020 01:00 IST|Sakshi
శ్రియ

‘నా అల్లుడు’ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించారు శ్రియ. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమాలు విడుదలై దాదాపు 15 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు శ్రియ స్వయంగా తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ఆమె చేయబోతున్న సినిమా ఇదే. లాక్‌డౌన్‌ కారణంగా భర్త ఆండ్రీతో కలసి స్పెయిన్‌లో ఉంటున్న శ్రియ అభిమానులతో చిట్‌చాట్‌ చేస్తూ తన తర్వాతి ప్రాజెక్ట్‌ల వివరాలు చెప్పుకొచ్చారు.

తెలుగులో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపానని, వాటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటనీ అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లలో అజయ్‌ దేవగన్‌తో కలసి నటించబోతున్నట్లు పేర్కొన్నారీ బ్యూటీ. అంటే... ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌కి జోడీగా ఆమె కనిపిస్తారని ఊహించవచ్చు. అలాగే సృజన దర్శకత్వం వహిస్తున్న ‘లిటిల్‌ బర్డ్‌’ అనే తెలుగు సినిమాలోనూ నటించనున్నారు శ్రియ. మహిళా దర్శకురాలితో పని చేయలేదనే లోటు ఈ సినిమాతో తీరనుంది అన్నారామె. అంతేకాదు.. తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా అంగీకరించాననీ, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చాక ఆయా చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటానని శ్రియ అన్నారు.

మరిన్ని వార్తలు