మరోసారి జోడీ?

3 Jun, 2019 01:23 IST|Sakshi

‘బలుపు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రవితేజ–శృతీహాసన్‌ మరోసారి జోడీ కడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘బలుపు’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం విడుదలైన ఆరేళ్లకు మళ్లీ రవితేజ–శృతీహాసన్‌ జంటగా నటించనున్నారట. అయితే ఈ సినిమాకి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతంలో రవితేజ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ‘డాన్‌శీను, బలుపు’ సినిమాలొచ్చాయి.

ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. వాస్తవ సంఘటనల నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ చివరిదశకు చేరిందట. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవగానే ఈ చిత్రంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇందులో రవికి జోడీగా శృతిని తీసుకోవాలని యూనిట్‌ ఇప్పటికే ఆమెను సంప్రదించగా నటించేందుకు ఎగై్జట్‌గా ఉన్నారని సమాచారం. 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు శృతి. ఆ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సలేను పెళ్లి చేసుకోనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌కి ‘బ్రేకప్‌’ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో శృతీహాసన్‌ మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టారు.

మరిన్ని వార్తలు