శ్రుతీని మేమే వద్దనుకున్నాం!

24 Jun, 2017 00:03 IST|Sakshi
శ్రుతీని మేమే వద్దనుకున్నాం!

‘‘కాల్షీట్స్‌లో క్లారిటీ లేదు. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ ఇవ్వలేదు... అందుకే ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పకుంటున్నా’’ అని శ్రుతీహాసన్‌ స్టెట్‌మెంట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్‌. సి. దర్శకత్వంలో తేనాండాళ్‌ ఫిల్మ్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని శ్రుతి వ్యాఖ్యలు చేసి, దాదాపు నెల అయ్యింది.

ఆ వార్తలపై ఇప్పుడు సంస్థ సీఈఓ హేమా రుక్మిణి స్పందించారు. ‘‘శ్రుతీహాసన్‌ తనంతట తను తప్పుకోలేదు. ఆమెతో కలిసి పని చేయలేం అని మేమే డిసైడ్‌ అయ్యాం. ఇది వృత్తిపరమైన నిర్ణయం. శ్రుతీహాసన్‌ స్థానంలో ఎవర్ని తీసుకోబోతున్నాం అన్నది త్వరలో తెలియజేస్తాం’’ అని హేమా రుక్మిణి అన్నారు. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ అందజేయని కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు శ్రుతి ఆరోపించారు. కానీ, హేమ మాత్రం స్క్రిప్ట్‌ ఎప్పుడో రెడీ అయ్యిందంటున్నారు. ‘‘కథ రెడీ అయ్యింది.

స్క్రిప్ట్‌ను ఫైన్‌ ట్యూన్‌ చేయాల్సిన అవసరం వస్తే, షూటింగ్‌ టైమ్‌లో అది ఆటోమెటిక్‌గా జరుగుతుంది’’ అని స్పష్టం చేశారామె.శ్రుతీహాసన్‌ స్థానంలో నయనతార యాక్ట్‌ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘నయనతార అమేజింగ్‌ ఆర్టిస్ట్‌. ఇది వరకు నయనతో వర్క్‌ చేశాం. ‘సంఘమిత్ర’ లుక్‌ ఎలా ఉండాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. సంఘమిత్ర ఎవరన్నది త్వరలోనే చెబుతాం’’ అన్నారామె. మరి.. హేమా రుక్మిణి వ్యాఖ్యలకు శ్రుతి స్పందిస్తారా? వెయిట్‌ అండ్‌ సీ.