శ్రుతికి షాక్‌!

24 Jun, 2017 02:39 IST|Sakshi
శ్రుతికి షాక్‌!

తమిళసినిమా: ఒక్కోసారి నిజాలు ఆలస్యంగా వెలుగు చూస్తాయంటారు. నటి శ్రుతీహాసన్‌ విషయంలోనూ ఇదే జరిగిందా? తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ అధినేతలు అవుననే అంటున్నారు. నిజం చెప్పాలంటే సంఘమిత్ర చిత్ర వివాదం నటి శ్రుతీహాసన్‌ను వెంటాడుతూనే ఉంది.

ఆ చిత్రంలో నాయకిగా నటించడానికి శ్రుతీహాసన్‌ అంగీకరించడంతో ప్రారంభానికి ముందే సంఘమిత్రకు బోలెడంత ఫ్రీ ప్రచారం వచ్చేసింది. శ్రుతీ కూడా కత్తిసాము లాంటి విద్యలో చాలా సీరియస్‌గా శిక్షణ పొందారు. అలాంటిది అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు వెల్ల డించడంతో పాటు. తనకు ఫుల్‌ స్క్రిప్ట్‌ ఇవ్వలేదని, కాల్‌షీట్స్‌ డీటెయిల్స్‌ చెప్పలేదంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే చిత్ర వర్గాల తరఫు మాత్రం తమ చిత్రంలో శ్రుతీహాసన్‌ నటించడం లేదు అని మాత్రమే వెల్లడించారు. దీంతో నిజాలేమయి ఉంటాయన్న ఆసక్తి చిత్ర వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెరిగిపోయింది. కొందరైతే నిర్మాతల వైపే తప్పు ఉందేమో అనుకున్నారు.

కాగా ఈ వ్యవహారం సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ« శ్రుతికి షాక్‌ ఇచ్చింది.
తాజాగా ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన హేమరుక్మిణి శ్రుతీహాసన్‌ వివాదంలో కుండబద్దలు కొట్టారు. శ్రుతీహాసన్‌ సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగలేదని, ఆమెతో కలిసి పని చేయలేని పరిస్థితుల్లో తామే తొలగించామని వెల్లడించారు. ఈ విషయం తాజాగా సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. మరి ఈ అంశంపై శ్రుతీహాసన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.