సినిమా: కోడి ముందా? గుడ్డు ముందా? అన్న సామెతను నటి శ్రుతీహాసన్ తనకు అన్వయించుకుంది. నటుడు కమలహాసన్ వారసురాలైన ఈ బ్యూటీ సంచలన నటి అనే ముద్ర వేసుకుంది. తొలుత సంగీత దర్శకురాలిగా రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు ఆ తరువాత లక్ అనే చిత్రంతో నటిగా బాలీవుడ్లో పరిచయమైంది. ఆ తరువాత టాలీవుడ్లోనూ, ఆపై కోలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఈ మూడు బాషల్లో నటించిన తొలి చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. అయితే ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో వరుస విజయాలతో లక్కీ హీరోయన్గా మారిపోయింది.
ఇక హిందీలో సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. సరిగ్గా అలాంటి సమయంలోనే లండన్కు చెందిన మైఖెల్ అనే వ్యక్తితో ప్రేమలో పడి సినిమాలకు దూరమైందనే ప్రచారం జోరుగా సాగింది. మైఖెల్ అనే వ్యక్తి ప్రేమలో పడ్డ మాట నిజమే. అతన్ని తన తల్లిదండ్రులకు పరిచయం చేసి తన ఫెయిర్నెస్ను చాటుకుంది. కాగా ఇటీవల ఈ ప్రేమ జంట విడిపోయారు. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారిద్దరూ. కాగా ప్రస్తుతం మళ్లీ నటనపై దృష్టి సారించిన శ్రుతీహాసన్ కోలీవుడ్లో విజయ్సేతుపతికి జంటగా లాభం అనే చిత్రంలో నటిస్తోంది.
అదే విధంగా హిందీలోనూ ఒక చిత్రం చేస్తోంది. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి. ఆ మధ్య రవితేజతో కలిసి నటించబోతుందనే ప్రచారం జరిగినా, అది ఇంకా ఫైనలైజ్ అయ్యినట్లులేదు. కాగా ఈ బ్యూటీ నటించిన తొలి చిత్రం లక్ (హింది) విడుదలై 10 ఏళ్లు అయ్యింది, ఆ చిత్రం 2009 జూలై 24న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా తను నటిగా ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయిన వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంది. ఈ పదేళ్లలో తాను చాలా నేర్చురన్నానని చెబుతూ పలు విషయాల గురించి స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించింది. నటన అన్నది మీ చిన్ననాటి కలా? లేక తల్లిదండ్రులు ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ రంగానికి వచ్చారా? అని తనను చాలా మంది అడుగుతున్నారని, కోడి ముందా?గుడ్డు ముందా? అన్న సామెతను తాను చిన్నతనంలోనే విన్నానని, ఆ సామెతే ఈ ప్రశ్నకు సమాధానం అని చాలా తెలివిగా చెప్పింది.
సినిమా రంగంలో మీరు మొదట ఎంచుకుంది ఏ శాఖను అని అడుగుతున్నారని, సంగీతం అని చాలా సార్లు చెప్పానని అంది. కాగా తనను సినిమా దత్తత తీసుకుందనే చెబుతానని పేర్కొంది. చిన్న వయసులోనే పాఠశాల నుంచి రాగానే తన తండ్రితో కలిసి షూటింగ్లకు వెళ్లేదాన్నది చెప్పింది. అక్కడ జనరేటర్ వ్యాన్ సమీపంలో కూర్చుని హోమ్ వర్క్ చేసుకునేదాన్నని తెలిపింది. చిత్ర నిర్వాహకులు తనను చాలా ప్రేమగా చూసుకునేవారని చెప్పింది. అందువల్లే తనకు సినిమాపై ఆసక్తి కలిగిందా? అన్నది తెలియదని, అయితే సినిమారంగమే తనను ఆహ్వానించిందని చెప్పింది. ఒక్కటి మాత్రం నిజం అని, సినిమా నుంచి తనను వేరు చేయడం కుదరదని శ్రుతీహాసన్ స్పష్టం చేసింది. నటిగా మరింత శ్రమించి అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికి కృషి చేస్తానని చెప్పింది.