అజిత్‌తో మరోసారి..

16 Jul, 2017 01:48 IST|Sakshi
అజిత్‌తో మరోసారి..

తమిళసినిమా: అజిత్‌తో నటి శ్రుతీహాసన్‌ మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతోందా? సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో శ్రుతీహాసన్‌ ఒకరని చెప్పవచ్చు. తనకు తోచింది నిర్భయంగా చెప్పే మనస్తత్వం కలిగిన ఈ బ్యూటీ ఇటీవల సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి వార్తల్లో కెక్కింది. ప్రస్తుతం కెరీర్‌ పరంగా శ్రుతీకి బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోందని చెప్పవచ్చు.

చేతిలో ఒక్క చిత్రం లేదు. తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు సగంలోనే ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు మొదలవుతుందో స్పష్టమైన సమాచారం లేదు. ఆ మధ్య విడుదలైన హిందీ చిత్రం చాలా నిరాశనే మిగిల్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నటుడు అజిత్‌ 58వ చిత్రంలో హీరోయిన్‌ అవకాశం శ్రుతీహాసన్‌ తలుపు తట్టబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం వైరల్‌ అవుతోంది.

అజిత్‌ వివేగం చిత్రాన్ని పూర్తి చేశారు. కాజల్‌అగర్వాల్‌ నాయకిగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 10వ తేదీన విడుదలకు ముస్తాబవుతోందని సమాచారం. దీంతో అజిత్‌ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నట్లు, ఈ చిత్రానికి వీరం, వేదాళం, వివేగం చిత్రాల దర్శకుడు శివనే దర్శకత్వం వహించనున్నారని, ఇందులో శ్రుతీహాసన్‌ను కథానాయికిగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రుతీహాసన్‌ ఇప్పటికే వేదాళం చిత్రంలో అజిత్‌కు జంటగా నటించిందన్నది గమనార్హం. అయితే అజిత్‌ తాజా చిత్రానికి సంబంధించిన అధికారకంగా ఎలాంటి  ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.,