శృతి కొత్త తత్వం

3 Jan, 2020 07:59 IST|Sakshi

దైవదూతలు స్నేహితుల రూపంలో వస్తారని శృతీహాసన్‌ బలంగా నమ్ముతున్నారు. ఎప్పట్నుంచి నమ్ముతున్నారు! ఎప్పట్నుంచో కాదు. గత ఏడాదిలో ఓ రోజు నుంచీ! ‘ఓ రోజు’ అంటున్నారు తప్పితే ఏ రోజో కచ్చితంగా చెప్పడం లేదు శృతి. ‘‘2019 లో నేనొకటి తెలుసుకున్నాను. మనం చిక్కుల్లో పడబోతున్నప్పుడు దైవదూతలు గమనించి, మన స్నేహితుల రూపంలో మన దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా శృతి చెప్పారు. ఓ ప్రశ్న అంటే.. ఏ ప్రశ్న? ‘‘గత ఏడాది మీరు నేర్చుకున్న జీవిత పాఠం ఏమిటి?’’ అన్న ప్రశ్న. ‘‘మనం చేయగలిగిన మంచి పని ఏదైనా ఉందీ అంటే అది.. మనల్ని మనం ప్రేమించుకోవడమే’’ అని ఆమె సమాధానం. ఆ సమాధానం తర్వాతే దైవదూతలు, స్నేహితులు అంటూ మాట్లాడారు శృతి. ఆమె ప్రేమ విఫలమైంది అని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం కావచ్చు.. ఆమెలోని ఈ తాత్వికత. ‘రేసుగుర్రం’ సినిమాలోని తన క్యారెక్టర్‌లా కూల్‌గా ఉంటూ కూల్‌గా మాట్లాడుతున్నారు శృతీహాసన్‌ గత రెండు రోజులుగా. ‘కూల్‌’ అనేది ఆమె చేసుకున్న కొత్త సంవత్సర తీర్మానంలా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు